మనం ఇండియాలో పనసపండ్లను ఆసక్తిగా తింటాం. వాటి రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఇలాంటిదే తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ అనే పండు ఉంటుంది. ఇది విపరీతమైన కంపు కొడుతుంది. ఆ వాసన మనం భరించలేం. అందుకే ఈ పండు తినాలంటే చాలా మంది ఇబ్బందిగా ఫీలవుతారు. కానీ పండు రుచి బాగుంటుంది. ఈ పండ్లలో దాదాపు 30 రకాల జాతులున్నాయి. వాటిలో 9 రకాల జాతుల పండ్లను తినవచ్చు. ఇండొనేసియాలోని సుమత్రా దీవుల్లో ఈ పండ్లను మొదట కనుక్కున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఈ పండ్లు లభిస్తున్నాయి.
మన దగ్గర పండ్లలో రారాజుగా మామిడిని చెబుతాం. తూర్పు ఆసియా దేశాల్లో డ్యురియన్ పండ్లను రారాజుగా చెబుతారు. ఈ పండ్లు ఒక్కొక్కటీ దాదాపు 3 కేజీల బరువు పెరుగుతాయి. ఈ పండు, కుళ్లిపోయిన ఉల్లిపాయ వాసన వస్తుంది. అందువల్లే చాలా మంది కడుపులో తిప్పినట్లు ఫీలవుతారు. ఇంకా చిత్రమేంటంటే.. మీరు ఈ పండును ఇంటికి తెచ్చి, తిరిగి ఎక్కడికైనా పట్టుకెళ్లినా, మీ ఇంట్లో ఈ పండు వాసన కొన్ని రోజులపాటూ ఉంటుంది. అందుకే ఈ పండును హోటళ్లు, ప్రజా రవాణా వాహనాల్లో తీసుకెళ్లనివ్వరు. ఈ పండును తీపి పదార్థాల్లో వాడతారు. లోపలి గింజలను కూడా ఉడకబెట్టి తింటారు.
రుచి ఎలా ఉంటుంది?
ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. తీపి రుచి ఉంటుంది. మెత్తమెత్తగా సీతాఫలం తరహాలో ఉంటుంది. కారామెల్, వెనీలా, చీజ్ కేక్ రుచి కలిగివుంటుంది.
ధర ఎంత?
ఇప్పుడు డ్యురియన్ పండ్లను ఇండియాలో కూడా సాగు చేస్తున్నారు. మీరు వీటిని ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కొనవచ్చు. ఒక పండు ధర రూ.200 దాకా ఉంటుంది.

No comments:
Post a Comment